‘తెలంగాణ పురం’ శాసనంపై పెంటయ్య నాకు ఏంచెప్పాడంటే..
personBuruju Editor date_range2024-11-18
1) 20 ఏళ్ల క్రితం తెల్లాపూర్ శాసనాన్ని శుభ్రపర్చి అధికారులకు చూపించిన ఉప్పర పెంటయ్య (2) ప్రస్తుతం తెల్లాపూర్ లో శాసనం గల ప్రాంతం (3) తెలంగాణ పురం అనే పేరు తొలిసారిగా రాసి ఉన్న శాసనం
Pilla Sai Kumar, Editor, Buruju.com : Hyderabad: హైదరాబాదు నగరానికి సమీపంలోని తెల్లాపూర్ Tellapur ఇప్పుడు ఆకాశహార్మ్యాల నిర్మాణలతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ అనే పేరు లిఖించి ఉన్న 600 ఏళ్ల క్రితం నాటి తెలుగు శాసనం ఇదే చోట కొన్నేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి చారిత్రక ఆధారాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఉప్పర పెంటయ్య ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఎర్వగూడ గ్రామంలో నాకు తారస పడ్డాడు. తనది ‘తెల్లాపురం’ (తెల్లాపూర్ కాదు) అని అతను చెప్పటంతో నాకు ఆసక్తి కలిగి సంభాషణను పొడిగించాను. ఆనాడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మకుడిగా ఉంటూ శాసనాన్ని ఏ విధంగా శుభ్రపర్చి అధికారులకు చూపించిందీ అతను వెల్లడించాడు. ఆనాటి సంఘటనను అతను ఎంతో అబ్బురపడుతూ చెప్పాడు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతనైనా మన పాలకులు పెంటయ్య మాదిరి ఆర్తిని కనబర్చి ఉంటే శాసనం దొరికిన చోట మరికొన్ని చారిత్రక ఆధారాలు లభించి ఉండేవి.
ఒకప్పటి తెలంగాణ పురం ఇప్పుడు ఇలా మారిపోయింది (2) తెలంగాణ పురంలో వందల సంవత్సరాల క్రితం ఏంజరిగిందో కాని ఒక వీరుడి వీరగల్లు అక్కడ ఇప్పటికీ ఉంది. పరుల కోసం ప్రాణాలను అర్పించిన వారికి ఇలా వీరగల్లులను ఆరోజుల్లో చెక్కించేవారు. దీనిలో ఒకరు కత్తి, డాలు పట్టుకొని ఉన్నారు
తెలంగాణ అనే పేరు గల శాసనాలు రాష్ట్రంలో ఇప్పటికి రెండు మాత్రమే బయటపడ్డాయి. వీటిలో ఒకటి క్రీ.శ. 1418 నాటి తెల్లాపూర్ Tellapur శాసనం కాగా మరొకటి క్రీ.శ. 1510 నాటి వెలిచర్ల శాసనం. మరికొన్ని గ్రామాలను కలుపుకొని తెల్లాపూర్ 2018లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఇక్కడ స్తంభాల బావి ప్రాంతంలో అక్షరాలు చెక్కిన ఒక శాసనం ఉన్నట్టుగా 38 ఏళ్ల క్రితం పురావస్తు శాఖ గుర్తించినప్పటికీ దాదాపు 20 ఏళ్ల క్రితం మాత్రమే దానిలో ‘ తెలంగాణ పురం’ అనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ శాసనం అంత వరకు పొదల మాటున పడి ఉండేది. అప్పట్లో గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఉప్పర పెంటయ్య నాకు చెప్పిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం ఒక మహిళా అధికారి అక్కడికి వచ్చి శాసనం గల ప్రాంతాన్ని వెదుకుతుంటే సర్పంచి సూచనల మేరకు పెంటయ్య ఆమెను స్తంభాల బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడి పొదలను తొలగించి శాసనాన్ని చూపించాడు. అప్పటికప్పుడు సర్ప్ పౌడరు, బ్రెష్ కొని తెచ్చి శాసనాన్ని బాగా కడిగాడు. అనంతరం దానిపైన గల అక్షరాలపై ఆ అధికారిణి పేపరును అదిమిపెట్టి అక్షరాలు దానిపై పడేలా చేసి తీసుకెళ్లారు.
తెల్లాపూర్ శాసనంలో అక్షరాలు ఇలా ఉన్నాయి
ఇప్పటికి 600 సంవత్సరాల క్రితం బహమని సుల్తాన్ ఫిరోజ్ షా తన భార్యతో కలసి పానగల్లు కోటకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యమంలోని ‘తెలంగాణ పురం’లోని మామిడితోపు వద్ద విడిది చేసినట్టు, ఆ సమయంలో ఆక్కడి శిల్పులు సుల్తాను భార్యకు బంగారు నగలను అందజేసినట్టు శాసనంలో లిఖించి ఉంది. శాసనాన్ని అక్కడి దిగుడు బావి ఏతాం స్తంభాల వద్ద అమర్చినట్టూ దానిలో పేర్కొన్నారు. మొత్తం 24 లైన్లలో విశ్వకర్మల పేర్లతో సహా వివరాలు ఉన్నాయి. తెలంగాణ పేరును పేర్కొంటున్న తొలి శాసనం ఇదేనని చరిత్రకారులు తేల్చారు. ఇంతటి అద్భుతమైన చరిత్రను బయటపెట్టిన తెల్లాపూర్ శాసనాన్ని, ఆ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోలేదు. శాసనంలో పేర్కొన్న దిగుడు బావిని చాలా ఏళ్ల క్రితమే మూసివేశారు. అప్పట్లో నీటిని తోడేందుకు వీలుగా ఏర్పాటు చేసిన రెండు స్తంభాలు మాత్రం మిగిలి ఉండటంతో స్తంభాల బావి అనే పేరు మాత్రం ప్రస్తుతం మిగిలి ఉంది. అక్కడ కత్తి, డాలు పట్టుకొన్న ఒక వీరుడి శిల్పం కూడా ఉంది. తన చిన్నతనంలో అక్కడ మామిడి తోపు ఉండేదని, అప్పటికే మెట్ల బావిని మూసివేశారని పెంటయ్య చెప్పాడు. మున్సిపాలిటీగా మారిన తర్వాత దానిలోను పెంటయ్య పనిచేస్తూ కరోనా సమయంలో ఇళ్లపైకి వ్యాధి నిరోధక మందులను పిచకారి చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఉద్యోగాన్ని తన కుమారుడికి అప్పగించి తాను మాత్రం ఒపిక ఉన్నప్పుడు కూలిపనులకు వెళ్తున్నాడు. అలా ఎర్వగూడ Yervaguda గ్రామానికి వచ్చినప్పుడే అతను నాకు తారసపడ్డాడు.
ప్రస్తుత తెల్లాపూర్ ఇది.. ప్రభుత్వం చొరవ తీసుకొని దీని పేరును తెలంగాణ పురంగా మార్చాలి
కనీసం తెలంగాణ ఆవిర్భవించిన తర్వాతనైనా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తవ్వకాలు జరిపుంటే ఎన్నోకొన్ని ఆధారాలు వెలుగు చూసి ఉండేవి. ఇప్పుడిక ఆ అవకాశాలు లేనేలేవు. ఎందుకంటే తెల్లాపూర్ అంతా గేటెడ్ కమ్యునిటీలతో ఖరీదైన ప్రాంతంగా మరిపోతోంది. కనీసం తెల్లాపూర్ పేరును తిరిగి ‘తెలంగాణ పురం’ Telangana Puram అని మార్చేందుకైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాసనం గల చిన్న పాటి స్థలం తప్ప చుట్టూ ఇప్పుడు ఇళ్లు వెలిశాయి. ఆ కొద్ది పాటి స్థలాన్నైనా రక్షత ప్రాంతంగా ప్రకటించి దాన్నొక సందర్శన కేంద్రంగా తీర్చిదిద్దాలి. శాసనంలోని వివరాల ఆధారంగా ఆనాటి సామాజిక , చారిత్రక అంశాలపై పరిశోధనలకు ఔత్సాహికులు నడుం కట్టాలి. హైదరాబాదుకు తెల్లాపూరు దాదాపు 25 కి.మీటర్ల దూరంలో ఉంటుంది.